సీఎం రేవంత్ రెడ్డి … ఈసారి కేంద్ర అధికారం మాదే

Political Telangana

సీఎం రేవంత్ రెడ్డి … ఈసారి కేంద్ర అధికారం మాదే; తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు వెళ్లారు. కేరళలోని వయనాడు నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా.. అక్కడ ఆయనకు మద్దతుగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేశారని.. ఈ సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీ 20 ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 20 ఏళ్లు ఆయన ప్రధాని పదవిలో కొనసాగుతారని అన్నారు. ”గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్న మోదీ వారణాసి నుంచి ఎన్నికయ్యారని.. రాబోయే 20 సంవత్సరాలు ప్రధానమంత్రి వయనాడ్ నుంచి ఎన్నికవుతారు. వయనాడు ప్రజలు కేవలం ఎంపీ కోసం ఓటు వేయడం లేదు.. కాబోయే ప్రధాని కోసం ఓటు వేస్తున్నారని నేను వారికి చెప్పాలని అనుకుంటున్నాను. వయనాడుకు అవసరమైన, ఇన్నేళ్ల నుంచి ఆగిపోయిన ఫండ్స్ అన్ని వస్తాయి. అందుకోసం రాహుల్ గాంధీని ప్రధానిని చేయాల్సిన అవసరం ఉంది” అని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. అందరికి ఒకటే సందేహం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో బీజేపీ నేతలు మమ్మల్ని కలిసినప్పుడు కూడా.. ‘మాకు (బీజేపీ) ప్రధాని మోదీ, ఈవీఎంలు ఉన్నాయి.. మీరు (కాంగ్రెస్) అధికారంలోకి రాలేరు’ అని అంటారు. ఈవీఎంలతో ప్రధాని మోదీకి సంబంధం ఏమిటి? బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలంటే బీజేపీకి ఎందుకు భయం? ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి, భారత్ మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తోంది. మాకు, ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయింది, బీజేపీకి మాత్రమే దానిపై నమ్మకం ఉంది, అది సరిపోదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.