సీఎం జగన్ పై దాడి… మూడు కుట్లు వేసి విశ్రాంతి తీసుకోమన్న డాక్టర్లు : సీఎం వైఎస్ జగన్ తలకు తీవ్రమైన గాయమైంది. శనివారం రాత్రి మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు మూడు కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఈ కారణంగా ఆదివారం జరగాల్సిన బస్సుయాత్ర రద్దు అయినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. తదుపరి షెడ్యూల్ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపాయి పార్టీ వర్గాలు.దీనిపై పలువురు రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు స్పందించారు.శనివారం కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది బస్సుయాత్ర. ఈ నేపథ్యంలో సింగ్ నగర్ నుంచి వివేకానంద స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఆకతాయిలు క్యాట్బాల్తో రాళ్లదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ కు ప్రత్యేక చికిత్స అందిచారు వైద్యులు. ఎడమకన్ను పైభాగంలో నుదురుపై బలమైన గాయం తగిలినట్లు చెబుతున్నారు డాక్టర్లు. రాయి లోతుగా దిగిందని అందుకే మూడు కుట్లు వేసినట్లు ప్రకటించారు విజయవాడ జీజీహెచ్ వైద్యులు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచిస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు.